న్యూఢిల్లీ, డిసెంబర్ 26: దేశంలో సెల్ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత సైబర్ నేరాలు పెరిగాయి. భారతీయులే కాదు అమెరికాలో కూడా మోసపోయి కోట్లు పోగొట్టుకుంటున్నారట. అక్కడి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికన్లను మోసం చేస్తున్నది భారత్లోని సైబర్ నేరగాళ్లే అని ఎఫ్బీఐ చెప్తున్నది. గత రెండేండ్లలో భారత్కు చెందిన నకిలీ కాల్సెంటర్లు, సైబర్ మోసగాళ్ల చేతుల్లో అమెరికన్లు సుమారు రూ.25 వేల కోట్లు మోసపోయినట్టు చెప్పింది. అనేక రకాలుగా అమెరికన్లను సైబర్ మోసగాళ్లు ముంచేస్తున్నారని ఎఫ్బీఐ తెలిపింది. ఇందులో వలపు వల, ఫోన్ స్కామ్లు, మాస్ మెయిలింగ్ ద్వారా చేసే మోసాలు, సాంకేతిక సహాయం పేరుతో చేస్తున్న మోసాలు ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ప్రముఖ కంపెనీల కాల్ సెంటర్ల నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మించి అమెరికన్లను మోసం చేస్తున్నారు. లోన్లు మంజూరు చేస్తామని చెప్పి కొంత డబ్బును డిపాజిట్ చేయించుకుంటున్నారు. కొందరు అయితే అమెరికాలోని ఫెడరల్ ఏజెంట్లుగా, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఉద్యోగులుగా నమ్మించి డబ్బు వసూలు చేస్తున్నారు.
భారత్ నుంచి ఎలా?
అమెరికాతో పాటు యూరోప్ దేశాలకు చెందిన ప్రముఖ సంస్థల కాల్సెంటర్లు భారత్లో ఉన్నాయి. ఇక్కడ తక్కువ వేతనాలకు ఉద్యోగులు లభిస్తారనే ఉద్దేశంతో భారత్లో కాల్సెంటర్లను నెలకొల్పాయి. ఇక్కడి కాల్ సెంటర్ల నుంచే అమెరికన్ల డాటా నకిలీ కాల్ సెంటర్లకు, సైబర్ నేరగాళ్లకు చేరుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి మోసాలు చాలా రోజులుగానే కొనసాగుతున్నాయి. ఫిబ్రవరిలో అమెరికా ట్రెజరీ విభాగం భారత్ కేంద్రంగా నడుస్తున్న కొన్ని నకిలీ కాల్ సెంటర్ల వివరాలను, వాటి డైరెక్టర్ల పేర్లతో సహా వెల్లడించింది.