లక్నో: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ… పెళ్లి చేసుకున్న వెంటనే ఇద్దరు కలిసి తనువు చాలించారు. ఇది ఓ ప్రేమ జంట విషాద గాథ. కుటుంబాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రేమ జంట పెళ్లి చేసుకున్నారు. స్వీట్లు తినిపించుకున్నారు. ఆ తర్వాత తాడుతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. (Couple Die By Suicide) ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధానగర్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల రాఖీ చౌహాన్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చెందిన 24 ఏళ్ల మనీష్ చౌహాన్ ప్రేమించుకున్నారు. అయితే వారి ప్రేమ సంబంధాన్ని ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి రాఖీని మనీష్ కలిశాడు. ఆమె నుదుటపై బొట్టుపెట్టాడు. వారిద్దరూ స్వీట్లు తినిపించుకున్నారు. అనంతరం ఒకరినొకరు పట్టుకుని ఒకే తాడుతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కాగా, ప్రేమ జంట ఆత్మహత్య విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పడి ఉన్న స్వీట్ బాక్స్, తిలకం భరిణిని స్వాధీనం చేసుకున్నారు. రాఖీ, మనేష్ మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం తర్వాత ప్రేమ జంట మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట మృతదేహాలకు ఇరువురి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.