న్యూఢిల్లీ, నవంబర్ 17: డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్కాస్టింగ్(డీ2ఎం)పై ఢిల్లీ క్యాపిటల్ రీజియన్లో త్వరలో పైలట్ ప్రాజెక్టు చేపడతామని కేంద్రం తెలిపింది. టెలివిజన్ సర్వీసులు నేరుగా మొబైల్లో వచ్చేలా దీన్ని చేపట్టనున్నట్టు గురువారం కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వెల్లడించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన బిగ్ పిక్చర్ సదస్సులో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం దేశంలో 20 కోట్ల టెలివిజన్ వీక్షక కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. భారత్లో 60 కోట్ల మంది స్మార్ట్ఫోన్, 80 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు ఉన్నారని, టెలివిజన్ సర్వీసులను వాళ్ల చెంతకు చేర్చాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ఐఐటీ కాన్పూర్, సంయుక్త ల్యాబ్స్ కలిసి ఈ పైలట్ అధ్యయనాన్ని చేపడతాయని వెల్లడించారు.