న్యూఢిల్లీ: భారతదేశంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్పై మరోసారి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అసలు ఈ సంస్థ ఎలా పనిచేస్తుంది? యూజర్లను ఆన్లైన్ దాడుల నుంచి ఎలా కాపాడుతుంది? వంటి అంశాలపై వివరణ ఇవ్వాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది.
ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మైటీ) నుంచి ఫేస్బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్కు నోటీసులు అందినట్లు సమాచారం. యూజర్లకు ఫేస్బుక్ అల్గారిథమ్ చేసే రికమండేషన్లలో అవాస్తవాలు ఉన్నట్లు ఒక విజిల్ బ్లోవర్ కొన్ని పత్రాలను లీక్ చేశారు.
అంతేకాదు ‘ఇండియా ఎక్స్పెరిమెంట్’ పేరుగో ఫేస్బుక్ ఒక ప్రయోగం చేసినట్లు ఈ డాక్యుమెంట్లలో వెల్లడైంది. దీని ప్రకారం ఒక డమ్మీ యూజర్ను సృష్టించి, కేవలం మూడు వారాల్లోనే అతని ఖాతాను విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులతో నింపేశారట. ఈ విషయం తెలిసిన తర్వాత భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఫేస్బుక్ అనుసరించే అల్గారిథమ్ వ్యవస్థలపై అనుమానాలు లేవనెత్తింది. కంటెంట్ మోడరేషన్ కోసం ఫేస్బుక్ ఉపయోగించే అల్గారిథమ్కు సంబంధించిన వివరాలను ప్రభుత్వం కోరిందని, విద్వేష పూరిత కంటెంట్ వల్ల ఆన్లైన్లో జరిగే చెడును ఎలా నిలువరిస్తున్నారని అడిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ విషయంలో ఫేస్బుక్ ఇచ్చే సమాధానాన్ని బట్టి ప్రభుత్వం స్పందన ఉంటుందని, అవసరమైతే కంపెనీ ప్రతినిధులను పిలిపించుకొని ఈ విషయాన్ని చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే కొత్త ఐటీ చట్టాల అమలు విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రస్తావించినట్లు సమాచారం.