Delhi Incident | దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సంవత్సరం వేళ ఓ యువతి స్కూటీని ఢీకొట్టిన కారు.. అనంతరం ఆమెను ఈడ్చుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో 20 ఏండ్ల వయసున్న యువతి మృతి చెందింది. ఈ ప్రమాద ఘటనపై గంట గంటకో కొత్త విషయం వెల్లడి అయింది. ఆ యువతిని కారు కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే ఈడ్చుకెళ్లిందని మొదట్లో పోలీసులు చెప్పారు. కానీ తాజాగా బయటకొచ్చిన వివరాల ప్రకారం ఆమెను 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లినట్లు వెల్లడి అయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలో ప్రత్యక్ష సాక్షి దీపక్ దహియా మీడియాకు వెల్లడించారు.
ప్రత్యక్ష సాక్షి దీపక్ దహియా కథనం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 3:20 గంటలకు నేను నా షాపు బయట నిల్చున్నాను. నాకు 100 మీటర్ల దూరంలో ఉన్న కారులో నుంచి ఓ భారీ శబ్దం వినిపించింది. టైరు పేలి ఉండొచ్చని నేను అనుకున్నాను. అంతలోనే కారు ముందుకు కదిలింది. అయితే ఓ మహిళను ఈడ్చుకెళ్తున్నట్లు గమనించాను. తక్షణమే పోలీసులకు సమాచారం అందించాను.
మరో 10 నిమిషాల్లో మళ్లీ కారు యూటర్న్ తీసుకునేందుకు వెనక్కి వచ్చింది. అప్పటికీ కూడా కారు కింది భాగంలోనే మహిళా మృతదేహం ఉంది. అక్కడక్కడే నిందితులు యూటర్న్స్ తీసుకుంటూ 4 నుంచి 5 కిలోమీటర్ల మేర కారును నడిపారు. ఆ కారులో ఉన్నవారిని ఆపేందుకు చాలాసార్లు ప్రయత్నించాను. కానీ వారు కారు ఆపలేదు. గంటన్నర పాటు సుమారు 20 కిలోమీటర్ల మేర కారును తిప్పారు. ఇక కారు వెనుకాలే తాను కూడా వెళ్లాను. పోలీసులకు సమాచారం అందిస్తూనే ఉన్నాను. గంటన్నర సమయం తర్వాత కాంజావాలా రోడ్డులోని జ్యోతి విలేజ్ వద్ద డెడ్ బాడీ పడిపోయింది. దీంతో నిందితులు కారును వేగంగా ముందుకు పోనిచ్చారు. ఇది యాక్సిడెంట్ కాదు.. కావాలని ఆ యువతిని చంపినట్లు ఉందని దీపక్ దహియా మీడియాకు వివరించారు.