Sabarimala | తిరువనంతపురం: కేరళలోని శబరిమలకు భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అయ్యప్ప దర్శనం వేళలు గంట పొడిగిస్తూ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఆదివారం నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఉన్న దర్శన వేళలను గంట పెంచింది. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శన అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా దర్శనం కోసం క్యూలో వేచి ఉన్న వారికి మంచినీరు, బిస్కెట్లు అందజేస్తామని చెప్పారు.
క్యూలో తోపులాట.. బాలిక మృతి
శబరిమల కొండపై చోటుచేసుకున్న తొక్కిసలాటలో 11 ఏండ్ల బాలిక మృతి చెందింది. అయ్యప్ప దర్శనానికి శుక్రవారం సాయంత్రం నుంచి వేలాది మంది భక్తులు రావడం ప్రారంభించారు. క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. దీంతో తోపులాట చోటుచేసుకుంది. లైన్లో దర్శనం కోసం వేచి చూస్తున్న 11 ఏండ్ల బాలిక స్పృహతప్పి పడిపోవడంతో ఆమెను పంపా దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మరణించింది. తమిళనాడులోని సేలంకు చెందిన ఆ బాలిక మూడేండ్ల వయసు నుంచి హృద్రోగ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్టు బంధువులు తెలిపారు.