Gujarat : గుజరాత్లోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు కారణంగా మంటలు వ్యాపించాయి. దీంతో అనేకమంది కార్మికులు గాయపడ్డట్లు సమాచారం. ఈ ఘటన గుజరాత్, భరూచ్ జిల్లా, ఝగాడియా ప్రాంతంలోని జీఐడీసీ పరిధిలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మెట్రోపాలిటన్ ఎక్సిమ్కెమ్ అనే పరిశ్రమ ఔట్లెట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ఇక్కడ ఇతర పరిశ్రమలకు అవసరమయ్యే రసాయనాల్ని భారీగా తయారు చేస్తారు. దేశంలోని కీలక రసాయన పరిశ్రమల్లో ఇదీ ఒకటి. ఈ పరిశ్రమ పరిధిలో ఒక పేలుడు జరిగింది. దీని కారణంగా మంటలు భారీ స్థాయిలో వ్యాపించాయి. ఈ ఘటనలో అనేకమంది కార్మికులు గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఇక్కడికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంటల కారణంగా చుట్టుపక్కల పొగ భారీగా వ్యాపించింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఎంత మంది ఉన్నారు అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో స్తానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.