లక్నో: ఒక కోల్డ్ స్టోరేజీలో పేలుడు (cold storage explosion) జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం దౌరాలా పోలీస్ స్టేషన్ ప్రాంతం పరిధిలోని ఒక కోల్డ్ స్టోరేజీలో పేలుడు జరిగింది. దీంతో ఆ కోల్డ్ స్టోరేజీ పైకప్పు, గోడలు కూలాయి. అందులో పని చేసే పలువురు కార్మికులు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. అయితే పేలుడు శబ్ధం విన్న స్థానికులు వెంటనే స్పందించారు. ఆ కోల్డ్ స్టోరేజీ వద్దకు పరుగున వచ్చారు. శిథిలాల కింద చిక్కుకున్న కొందరిని బయటకు తీశారు. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ కోల్డ్ స్టోరేజీ వద్దకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు కార్మికులను కాపాడారు. పేలుడు సమయంలో ఆ కోల్డ్ స్టోరేజీలో 25 మంది కార్మికులు పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురు చనిపోయారని, పలువురు గాయపడినట్లు చెప్పారు. కొందరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని, వారి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు వెల్లడించారు.
మరోవైపు ప్రభుత్వ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కోల్డ్ స్టోరేజీలో జరిగిన పేలుడుపై ఆరా తీశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.