PM Modi | వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ అకస్మిక ప్రకటన చేశారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిలో మెజారిటీ రైతులు పంజాబ్, హర్యానా రాష్ట్రాల వారే. సాగు చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబర్ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో వీరంతా నిరసన తెలుపుతున్నారు.
వ్యవసాయ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టేందుకు తీసుకొచ్చిన ఈ మూడు వివాదాస్పద చట్టాల ప్రయాణం గతేడాది జూన్లోనే ఆర్డినెన్స్ల రూపంలో మొదలైంది. ఆర్డినెన్స్ల స్థానే సెప్టెంబర్లో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాక చట్టాలుగా మారాయి. నాటి నుంచి అన్నదాతలు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు వచ్చే ఏడాది జనవరి 12 వరకు వాటి అమలుపై స్టే విధించింది. అంటే కేవలం 221 రోజులు మాత్రమే ఈ చట్టాలు అమలయ్యాయన్నమాట.
ఏదైనా చట్టం చేయాలన్నా.. సవరించాలన్నా.. రద్దు చేయాలన్న పార్లమెంట్కు మాత్రమే అధికారం ఉంది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తూ బిల్లులు ప్రతిపాదిస్తుంది. చట్టాలుగా మార్చేందుకు బిల్లులు ప్రతిపాదించిన వారే తిరిగి రద్దు ప్రతిపాదనలతో కూడిన బిల్లులను పార్లమెంట్ల్లో ప్రవేశపెడతారు.
జనాభా ప్రాతిపదికన అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్తోపాటు పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్ స్థానికసంస్థల ఎన్నికల్లోనూ, హర్యానా అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ప్రతికూల ఫలితాలను చవిచూసింది.
వ్యవసాయ రంగంలో చారిత్రక సంస్కరణలుగా పేర్కొంటూ చట్టాలు చేసిన కేంద్రం.. వీటిని బలవంతంగా ఉపసంహరించుకోవడం చారిత్రకమే. ఇకనుంచి సంస్కరణల పథంలో ప్రయాణించాలంటే ఆచితూచి ముందుకెళ్లాల్సిందే. ఇంతకుముందు కూడా ప్రధాని మోదీ ప్రభుత్వం.. ఇలాగే వివాదాస్పద ఆర్డినెన్స్ను ఉపసంహరించుకున్నది.
ప్రజా ప్రయోజనాల రీత్యా ప్రజల నుంచి జరిపే భూసేకరణ పారదర్శకంగా సాగాలని, సరైన పరిహారం చెల్లించాలన్న గత యూపీఏ సర్కార్.. భూసేకరణ (సవరణ) చట్టం-2013 తీసుకొచ్చింది. దీనికి సవరణలతో పలు దఫాలు ఆర్డినెన్స్ తీసుకొచ్చినా.. తర్వాత పార్లమెంట్లో ఆమోదానికి నోచుకోలేదు. 2015 మార్చిలో లోక్సభ ఆమోదించినా.. రాజ్యసభ ఆమోదించలేకపోయింది.
మళ్లీ 2015 ఏప్రిల్లో ఆర్డినెన్స్ తెచ్చారు ప్రధాని మోదీ. బడ్జెట్ మలివిడత సమావేశాల్లో విపక్షం దాటికి తట్టుకోలేకపోయింది. మే 30న మళ్లీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ప్రధాని మోదీ. కానీ నాడు రాజ్యసభలో బలం లేకపోవడంతో 2015 ఆగస్టు 31న మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ వివాదాస్పద ఆర్డినెన్స్ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.