న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ప్రభుత్వ పథకాలు, చేపట్టిన పనులను ప్రచారం చేయడానికి సైన్యాన్ని, ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవడంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా సైన్యాన్ని, ఉద్యోగులను వాడుకోవడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ బ్యూరోక్రాట్ ఈఏఎస్ శర్మ, జగ్దీప్ ఎస్ ఛోకర్ దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి రక్షణ శాఖ పథకాలను ప్రచారం చేయాలని సైన్యాన్ని కేంద్రం ఆదేశించిందన్నారు. అలాగే వచ్చే లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పబ్లిక్ సర్వెంట్లను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించి కేంద్ర పథకాలను ప్రచారం చేయిస్తున్నట్టు పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు.. వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది.