బెంగళూరు, డిసెంబర్ 9: అది ఆగస్టు 2019. కర్ణాటక వ్యాప్తంగా కుండపోత వానలు. వరదల కారణంగా 61 మంది మరణించారు. 15 మంది జాడ తెలియకుండాపోయింది. రూ. 35 వేల కోట్ల మేర ఆస్తినష్టం సంభవించింది. రాజధాని బెంగళూరు సహా రాష్ట్రంలోని 22 జిల్లాలు నీటమునిగాయి. అయితే, బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో మాత్రం ఒక్క నీటి చుక్క కూడా నిల్వలేదు. కారణం.. సబ్ సర్ఫేస్ టెక్నాలజీ.
భారీ వర్షాలు, వరదల కారణంగా భూ మిపై నిలిచిపోయే నీటిని భూమి అడుగున ఏర్పాటు చేసిన ప్రత్యేక మార్గాల ద్వారా బయటకు పంపించే సాంకేతికతనే ‘సబ్-సర్ఫేస్ టెక్నాలజీ’ అంటారు.
రెండు అడుగుల విస్తీర్ణంలో చిల్లులతో కూడిన జాలీని నిర్మిస్తారు. దీనికి సెన్సర్లు ఉంటాయి. దీని తలుపులు మూసి ఉంటాయి. భూమి లోపల రెండు, మూడు అడుగుల లోతులో గొట్టాలతో ఈ జాలీని అనుసంధానం చేస్తారు. వరద నీరు పెరిగినపుడు ఈ సెన్సర్లు యాక్టివేట్ అయి, జాలీ తలుపులు తెరుచుకుంటాయి. వరద నీరు జాలీలోకి చేరుతుంది, ఈ నీటిని గొట్టాల ద్వారా జలాశయాలు, చెరువులకు పంపిస్తారు.
నిమిషంలో ఎంత
వరద నీరు వచ్చినపుడు ఒక్కో జాలీ ద్వారా నిమిషానికి 10 వేల లీటర్ల నీటిని ఎత్తిపోయవచ్చునని, ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని నిపుణులు చెప్పారు. అమెరికాలోని గోల్ఫ్, బేస్బాల్, ఫుట్బాల్ స్టేడియంలలో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారని తెలిపారు.