న్యూఢిల్లీ, మార్చి 11: హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి పట్ల భయాందోళన అవసరం లేదని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇన్ఫ్లూయెంజా కేసుల పెరుగుదలపై నిఘాను పెంచడంతో పాటు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెబుతున్నారు. కొవిడ్ సమయంలో తీసుకొన్న జాగ్రత్తలను కొనసాగించాలని అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ సహాని సూచించారు. కేసుల్లో కేవలం 5 శాతం మందే దవాఖానల్లో చేరుతున్నారని, భయాందోళన అవసరం లేదని అన్నారు. దేశంలో ఇన్ఫ్లూయెంజా వైరస్ కారణంగా ఇద్దరు మరణించినట్టు అధికారులు ధ్రువీకరించగా.. మరికొన్ని మరణాలు కూడా చోటుచేసుకున్నాయనే వార్తలు వస్తున్నాయి. కర్ణాటకలో హీరే గౌడ(82) అనే షుగర్, బీపీ రోగి ఈనెల 1న హెచ్3ఎన్2 వైరస్ కారణంగా మరణించగా.. హర్యానాలో 56 ఏండ్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్ చనిపోయారు. దేశంలో ఈ ఏడాది జనవరి 2 నుంచి మార్చి 5 వరకు 451 హెచ్3ఎన్ఈ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం పేర్కొన్నది. దేశంలో వైరస్ వ్యాప్తి పరిస్థితులపై పర్యవేక్షిస్తున్నామని, నెలాఖరు నాటికి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని తెలిపింది.