న్యూఢిల్లీ, మే 2: మినీ సార్వత్రిక ఎన్నికల సంగ్రామాన్ని తలపించిన నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వాస్తవ ఫలితాలకు దూరంగానే ఉన్నాయి. అస్సాం, పుదుచ్చేరి మినహా మిగతా ప్రధాన రాష్ర్టాలపై సర్వే సంస్థలు వెల్లడించిన ఫలితాలు నిజంకాలేదు.
యావత్ దేశ ప్రజానీకం దృష్టిని ఆకర్షించిన బెంగాల్ దంగల్లో అక్కడి ప్రజల నాడిని పసిగట్టడంలో సర్వే సంస్థలన్నీ ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. బెంగాల్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని, కాబట్టి రెండింట్లో ఎవరైనా పగ్గాలు చేపట్టవచ్చని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెప్పాయి. అయితే, బెంగాల్లో వార్ వన్ సైడ్గా మారింది. టీఎంసీ అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. సర్వే సంస్థలన్నీ (సగటున) టీఎంసీకి 150-160 స్థానాలు, బీజేపీకి 140-150 స్థానాలు వస్తాయని చెప్పాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 200కు పైగా స్థానాల్లో దూసుకుపోతున్నది. బీజేపీ 80 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నది.
ఉద్ధండ నేతలు కరుణానిధి, జయలలిత లేకుండా తమిళనాడులో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజనం వీయనుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఈ విషయంలో నిజమయ్యాయి. తమిళ తంబీలు కరుణానిధి వారసుడు స్టాలిన్కే పట్టంగట్టారు. అయితే, సర్వే సంస్థల సీట్ల అంచనాలు, వాస్తవ ఫలితాల్లో భారీ వ్యత్యాసం కనిపించింది. డీఎంకేకు 170-180 స్థానాలు, అన్నాడీఎంకేకు 45-50 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే, వాస్తవ పరిస్థితుల్లో డీఎంకేకు 155, అన్నాడీఎంకేకు 77 వరకు స్థానాలు దక్కాయి.
కేరళలో ప్రతి ఐదేండ్లకోసారి ఎన్నికల్లో అధికార పార్టీ గద్దెదిగి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని ఈ సారి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ బ్రేక్ చేస్తుందని సర్వే సంస్థలు అంచనాలు వేశాయి. ఎల్డీఎఫ్కు 70-75 స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు 55-60 స్థానాలు దక్కవచ్చని జోస్యం చెప్పాయి. అయితే, ఈ అంచనాలను తప్పు చేస్తూ ఎల్డీఎఫ్ 100 సీట్లలో దూకుడు ప్రదర్శించింది. యూడీఎఫ్ 40 సీట్లకే పరిమితమైంది. ఈ విషయంలో టుడేస్ చాణక్య అంచనాలు (ఎల్డీఎఫ్ 93-111, యూడీఎఫ్ 26-44) కొంతవరకూ నిజమయ్యాయి.
అస్సాంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రానుందని, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి పగ్గాలు చేపట్టనున్నదన్న సర్వే సంస్థల ఫలితాలు నిజమని తేలాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సీట్ల సంఖ్య కూడా వాస్తవ ఫలితాలకు దగ్గర్లోనే ఉండటం విశేషం.