Excise Policy Case | ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఏడాది అక్టోబర్లో సంజయ్ సింగ్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో ఉన్నారు. నవంబర్ 24న ఎంపీని కోర్టులో హాజరుపరిచింది. విచారణ సందర్భంగా ఆయన కస్టడీని కోర్టు డిసెంబర్ 4 వరకు పొడిగించింది.
అంతకుముందు, నవంబర్ 10న కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సంజయ్ సింగ్ బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టుతో పాటు ఢిల్లీ, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాడరింగ్ కేసు విచారణ జరుపుతున్నది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 సవరణ సమయంలో అవకతవకలు జరిగాయని, లైసెన్స్ హోల్డర్లకు అనవసరమైన ప్రయోజనాలు కల్పించినట్లు ఆరోపణలున్నాయి. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి.