న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఏప్రిల్ 5 వరకు పొడిగించింది. అయితే కస్టడీ సమయంలో కొన్ని మత సంబంధమైన, ఆధ్యాత్మిక పుస్తకాలను వెంట ఉంచుకునేందుకు అనుమతించాలని మనీష్ సిసోడియా కోర్టును కోరారు. దాంతో అందుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని కోర్టు సూచించింది.
కాగా, మంగళవారం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. ఈ క్రమంలో సిసోడియా బెయిల్ పిటిషన్పై ఈ నెల 25లోగా స్పందన తెలియజేయాలని కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఆదేశించింది. తాజాగా సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు (ఏప్రిల్ 5 వరకు) పొడిగించింది. మార్చి 17న కూడా సిసోడియా కస్టడీ ముగియడంతో ఈడీ అభ్యర్థన మేరకు కోర్టు మరో 5 రోజులు పెంచింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మనీష్ సిసోడియాను గత నెల 26న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్లో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు సీబీఐ విచారణలో తేలడంతో తీహార్ జైల్లో ఉన్న సిసోడియాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈడీ అభ్యర్థన మేరకు కోర్టు ముందుగా మార్చి 17 వరకు, ఆ తర్వాత మార్చి 22 వరకు, ఇప్పుడు ఏప్రిల్ 5 వరకు సిసోడియా కస్టడీని పొడిగించింది.