Paper Leakage | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతంపై విద్యార్థుల, పరీక్షార్థుల ఆవేదనలో అర్థమున్నది. వారి బాధ వాస్తవమే. అయితే ఆందోళనలో ఉన్న యువతను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతాల్లో సాధారణంగా జరిగేదేంటి? ఎంత బలమైన వ్యవస్థ ఉన్నా.. పరీక్షల నిర్వహణ మానవ ప్రమేయంపై ఆధారపడి నడుస్తుంది.
ఎక్కడో చోట.. ఎవరో ఒకరు.. అనైతికంగా ఉన్నోడు ప్రశ్నపత్రాన్ని బజారుకీడుస్తాడు. వ్యవస్థకు కీడు చేస్తాడు. పరీక్ష విధానానికే కళంకం తెస్తాడు. ఇలాంటివారు ఉన్నప్పుడు.. ఎక్కడైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగేది అదే. అయితే సమస్య మూలాన్ని గుర్తించాలి. వ్యవస్థను చక్కదిద్దుకోవాలి. గాయి చేసి పబ్బం గడుపుకోవడం కాదు.. గాయానికి చికిత్స చేయాలి. తెలంగాణలో ప్రశ్నపత్రం లీకేజీపై బీజేపీ, కాంగ్రెస్ రచ్చ చేస్తున్నాయి కానీ, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో జరిగిన లీకేజీ ఉదంతాలకు లెక్కేలేదు. పదుల సంఖ్యలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు లక్షలాదిమంది నిరుద్యోగుల కలల్ని కూల్చాయి. చివరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పరీక్షల్లోనూ ప్రశ్నపత్రాలు బయటకు వచ్చిన ఉదంతాలూ ఉన్నాయి. పరీక్షావ్యవస్థ పరువుకు డ్యామేజీ చేసిన లీకేజీ ఘటనలు ఇవీ..
బీజేపీ గొప్పగా చెప్పుకునే యోగి సర్కారులో పేపర్ లీక్ల ఘటనలు తరచూ జరుగుతున్నాయి.
ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో గత తొమ్మిదేండ్లలో 13 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి.
బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలో పదో తరగతి పరీక్షల పేపర్ లీకయ్యింది. సైన్స్ పరీక్ష పేపర్ను వాట్సాప్లో అమ్మకానికి పెట్టారు. రూ.100 నుంచి రూ.3,000 వరకు పేపర్ను అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. పేపర్ లీక్ ఘటన తమ ప్రభుత్వ వైఫల్యమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా అసెంబ్లీలో ఒప్పుకోవాల్సి వచ్చింది. మరోసారి ఇలాంటి జరగనివ్వమని సంజాయిషీ ఇచ్చుకున్నారు.
కర్ణాటకలో అవకతవకలు, అక్రమాల ఆరోపణలు రాకుండా పోటీ పరీక్షలు జరగడం లేదు. ఈ బాగోతాల్లో కొందరు బీజేపీ నేతల పాత్ర కూడా ఈ వ్యవహారాల్లో బయటపడుతున్నాయి.
జాతీయ స్థాయి పరీక్షల్లోనూ..
2021 జేఈఈ మెయిన్ పేపర్ హ్యాకింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. హర్యానాలోని సోనేపట్లో అక్రమార్కులు ప్రశ్నాపత్రాన్ని తస్కరించి జవాబులను పలువురు విద్యార్థులకు చేరవేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపింది. ఒక రష్యన్ హ్యాకర్ ప్రమేయాన్ని ఈ ఘటనలో గుర్తించింది. అదే ఏడాది నీట్ పరీక్షలో పేపర్ లీక్ వ్యవహారం రాజస్థాన్లో బయటపడింది. ఓ పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్నాపత్రాన్ని బయటకు పంపి అక్కడ జవాబులు గుర్తించి ఓ విద్యార్థినికి చేరవేశారు.
రాజస్థాన్లో 2011 నుంచి 2022 మధ్య ఏకంగా 26 పేపర్ లీక్ ఘటనలు జరిగాయి. ఇందులో 14 సంఘటనలు కాంగ్రెస్ హయాంలో గత నాలుగేండ్లలో జరిగాయి.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. దేశంలో బీజేపీ పాలిస్తున్న ప్రతి రాష్ట్రంలోనూ పేపర్ లీక్ ఘటనలు, పరీక్షల్లో అక్రమాల వ్యవహారాలు భారీగా జరుగుతున్నాయి. ఒకసారి ఘటన జరిగితే పొరపాటుగా భావించొచ్చు. పదేపదే జరుగుతున్నాయంటే అక్కడి ప్రభుత్వాల అసమర్థత స్పష్టమవుతున్నది. బీజేపీ మాత్రమే కాదు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోనూ ఈ ఘటనలు జరుగుతున్నాయి.