చండీఘఢ్ : ఇసుక అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీని ఈడీ అధికారులు గురువారం ప్రశ్నించారు. అంతకుముందు ఇదే కేసులో చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీ వద్ద రూ పది కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న అనంతరం భూపీందర్ను ఈడీ అరెస్ట్ చేసింది. గతంలో ఇదే వ్యవహారంలో చన్నీకి ఈడీ సమన్లు జారీ చేసినా ఆయన దర్యాప్తు అధికారుల ఎదుట హాజరు కాలేదు.
హనీతో చన్నీకి ఉన్న సంబంధాలు, ఆయన పంజాబ్ సీఎంగా ఉండగా హనీ సీఎంఓను పలుమార్లు సందర్శించడం గురించి ఈడీ అధికారులు చన్నీని ప్రశ్నించారు. ఇసుక మైనింగ్ కేసుకు సంబంధించిన కొందరు అధికారుల బదిలీపైనా ఈడీ ప్రతినిధులు చన్నీని ఆరా తీసినట్టు సమాచారం.
ఇసుక అక్రమ మైనింగ్ కేసులో హనీ సహా ఇతరులపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన నేపధ్యంలో చన్నీ సీఎం పదవికి రాజీనామా చేశారు. చన్నీ తాను పోటీచేసిన చమకూర్ సాహిబ్, బధౌర్ రెండు స్ధానాల్లో ఓటమి పాలయ్యారు.