ముంబై: ముంబై మాజీ మేయర్ కిశోరి పడ్నేకర్కు (Kishori Pednekar) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీచేసింది. కరోనాతో మరణించిన మృతదేహాల కోసం వాడే బ్యాగుల (Body Bags) కొనుగోలు కుంభకోణం కేసులో ఈ నెల 8న విచారణకు రావాలని ఆదేశించింది. కరోనా (Covid-19) సమయంలో 2020 నుంచి 2021 వరకు కిశోరీ పడ్నేకర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మేయర్గా పనిచేశారు. ఆ సమయంలో కరోనాతో చనిపోయిన వారికోసం కొనుగోలు చేసిన బాడీ బ్యాగ్స్ వ్యవహారంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రూ.1500గా ఉన్న ఒక్కో బాడీ బ్యాగ్ను బీఎంసీ రూ.6700కు కొనుగోలుచేసిందని, ఇందు కిశోరీ పడ్నేకర్తోపాటు బీఎంసీకి చెందిన ఇద్దరు అధికారుల పాత్ర ఉన్నదని ముంబైలోని అగ్రిపద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయింది. తర్వాత దానిని ముంబై పోలీస్ విభాగానికి చెందిన ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (EOW)కు బదిలీ చేశారు. ఇప్పటికే ఈఓడబ్ల్యూ విచారణకు పడ్నేకర్ హాజరయ్యారు కూడా. దీని ఆధారంగా కేసు నమోదుచేసిన ఈడీ.. మనీలాండరింగ్, అవినీతి ఆరోపణలు, అధిక ధరకు కొనుగోలు వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా తాజాగా ఆమెకు నోటీసులు జారీ చేసింది.