UP Elections | బీజేపీకి ఇటీవలే గుడ్ బై చెప్పిన మాజీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధరంసింగ్ సైనీ శుక్రవారం సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు భగవతీ సాగర్, వినయ్ , ముఖేశ్ వర్మ, రోషన్ లాల్ వర్మ కూడా సమాజ్వాదీలో చేరిపోయారు. ఇక అప్నాదళ్ ఎమ్మెల్యే చౌదరీ అమర్ సింగ్ కూడా సమాజ్వాదీలో చేరారు. వీరందరికీ సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ మకర సంక్రాంతి పర్వదినం నాటికి బీజేపీ ఆట ముగిసినట్లేనని స్వామి మౌర్య విమర్శించారు. ఇప్పటి వరకూ బీజేపీ కుంభకర్ణుడి నిద్రలో ఉందని, ఈ పరిణామాలను చూసి వారికి అసలు నిద్రే పట్టడం లేదని మౌర్య ఎద్దేవా చేశారు. దళితులు, వెనుకబడిన వర్గాల మద్దతుతోనే యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అలాంటి వారినే ఇప్పుడు బీజేపీ విస్మరిస్తోందని ఆయన మండిపడ్డారు.