ఖమ్మం, మార్చి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపించే మంత్రి కేటీఆర్ ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లోనే ఉంటారని మంత్రి పు వ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కేటీఆర్ ఎక్కడ..? అని ప్రశ్నించే ప్రతిపక్షాలు, ఆయన సంధించిన ప్రశ్నలకు ఇప్పటికీ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాయని ప్రశ్నించారు. ఖమ్మం మమత కళాశాల ఆవరణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జాతీయ పార్టీలు బాధ్యత మరిచి.. అభివృద్ధికి పాటుపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజల కష్టసుఖాల్లో నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్సీగా పల్లా పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం లక్షా 31వేల ఉద్యోగాలు కల్పించిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఎవరికైనా దమ్ము, ధైర్యం ఉంటే ఈ లెక్కలు తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి పోటీ నుంచి విరమించుకుంటానని సవాల్ విసిరారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి కేసీఆర్కు రెండు కండ్లులాంటివని పేర్కొన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగుల కోసం నిరంతరం శ్రమించారని అన్నారు. సభలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాములు నాయక్, సండ్ర వెంకటవీరయ్య, జిల్లా పరిషత్ చైర్మన్లు లింగాల కమల్రాజ్, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిన బేగ్..
తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ బుడాన్ బేగ్ శుక్రవారం పార్టీ నేతల సమక్షంలో బహిరంగ సభావేదికపై టీఆర్ఎస్ పార్టీలో తిరిగి చేరారు. ఆయనకు మంత్రి పువ్వాడ, ఎంపీ నామా, ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా, మాజీ ఎంపీ పొం గులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
అభివృద్ధిని చూసి ఆదరించండి.. ఆలోచించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయండని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పల్లా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పల్లాతో డిగ్రీ చదువుకున్న ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు నగరంలోని ఓ హోటల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మిత్రులు ఆయన విజయానికి కృషిచేస్తామని ప్రతిన పూనారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా జూనియర్ కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పల్లాకు మద్దతు ప్రకటించారు. తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటె డ్ ఉద్యోగుల మద్దతు పల్లా రాజేశ్వర్రెడ్డికే ఉంటుందని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్, టీజీవో రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు.