జైపూర్: రాజస్థాన్లో బీజేపీ మాజీ మిత్రపక్ష పార్టీకి చెందిన హనుమాన్ బెనివాల్ (Hanuman Beniwal) ఈసారి ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) కన్వీనర్ అయిన ఆయన నాగౌర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ సోమవారం తెలిపింది. ‘ఇండియా’ బ్లాక్ కూటమిలో కీలక భాగమైన కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్లో మరో రెండు లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులను శనివారం ప్రకటించింది. అయితే నాగౌర్ స్థానాన్ని ఆర్ఎల్పీకి వదిలేసింది.
కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో కలిసి ఉన్న ఆర్ఎల్పీ చీఫ్ హనుమాన్ బెనివాల్, నాగౌర్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే 2020లో ఢిల్లీలో రైతులు చేపట్టిన భారీ నిరసనకు మద్దతుగా ఆ ఏడాది డిసెంబర్లో ఎన్డీయే నుంచి విడిపోయారు.
మరోవైపు జాట్ నాయకుడైన హనుమాన్ బెనివాల్ 2023 డిసెంబర్లో రాజస్థాన్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగౌర్ జిల్లాలోని ఖిన్స్వర్ స్థానం నుంచి పోటీ చేశారు. మరో జాట్ నాయకుడైన బీజేపీ అభ్యర్థి జ్యోతి మిర్ధాకు గట్టి పోటీ ఇచ్చి గెలిచారు. దీంతో ఎంపీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ అభ్యర్థిగా నాగౌర్ స్థానం తిరిగి పోటీ చేస్తున్నారు.