పాట్నా: ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపి హత్య చేసిన కేసులో మాజీ ఎంపీకి సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే బాధిత కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీహార్లోని ఆర్జేడీకి చెందిన మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్ (Prabhunath Singh)ను ఈ కేసులో దోషిగా నిర్ధారించిన కోర్టు తాజాగా శిక్షలు ఖరారు చేసింది. 1995 మార్చిలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సరాన్ జిల్లాలోని చప్రాకు చెందిన ఇద్దరు వ్యక్తులు తనకు వ్యతిరేకంగా ఓటు వేయడంపట్ల ప్రభునాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారిద్దరిపై గన్తో కాల్పులు జరిపి హత్య చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
కాగా, ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఐపీసీలోని సెక్షన్ 302, 307 కింద ప్రభునాథ్ సింగ్ను దోషిగా ఆగస్ట్ 18న నిర్ధారించింది. న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, అభయ్ ఎస్ ఓకా, విక్రమ్నాథ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. ఆయనకు జీవితకాల జైలు శిక్ష విధించింది. ఇది అసాధారణమైన బాధాకర ఎపిసోడ్ అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. తనకు వ్యతిరేకంగా ఆధారాలు లేకుండా చేసేందుకు ఆయన అన్ని ప్రయత్నాలు చేసినట్లు ఆరోపించింది. అలాగే బాధిత కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని బీహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం తీర్పు వెల్లడించింది.
మరోవైపు, ప్రభునాథ్ సింగ్ వరుసగా మూడుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1998 నుంచి 2009 వరకు బీహార్లోని మహారాజ్గంజ్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2013లో ఉప ఎన్నికలో గెలిచిన ఆయన 2014 వరకు పార్లమెంటు సభ్యునిగా కొనసాగారు. ఎంపీగా ఎన్నిక కాక ముందు 1985 నుంచి 1995 వరకు మస్రఖ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.