digital arrest : సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్లపై ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలా మంది ఈ ట్రాప్లో పడుతున్నారు. తమ డబ్బునంతా పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఒక వృద్ధుడు డిజిటల్ అరెస్ట్ కారణంగా ఏకంగా రూ.2.5 కోట్లు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగింది. ఈ ఘటనలో బాధితుడు 90 ఏళ్ల వృద్ధుడు. అతడు ఎయిర్ఫోర్స్లో డాక్టర్గా చేసి రిటైర్ అయ్యాడు.
ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 25న అతడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాము ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ నుంచి చేస్తున్నామని, అతడి డాక్యుమెంట్లు కొన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో వాడినట్లు తేలిందని చెప్పారు. తాము అతడిపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే తాము చెప్పినట్లు చేయాలన్నారు. పైగా ప్రతిసారి వీడియో కాల్ చేయాలని సూచించారు. తమ పరిధిలోనే ఉండాలని, ఇదంతా రహస్యంగా జరుగుతున్న ఒక అధికారిక ప్రక్రియ అని నమ్మించారు. ఈ విషయం గురించి ఫ్యామిలీతో సహా ఎవరికీ చెప్పకూడదని బెదిరించారు. నెమ్మదిగా అతడిపై ఒత్తిడి తెచ్చారు. తాము చెప్పినట్లు చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అతడిని బెదిరిస్తూ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బును తమ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.
ఇలా 25 రోజుల్లో సైబర్ నేరగాళ్లు మొత్తం రూ.2.5 కోట్లు కొల్లగొట్టారు. అయితే, ఒకేసారి ఇంత మొత్తంలో భారీ నగదు ట్రాన్స్ఫర్ అవుతుండటంతో అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజర్ ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.