Ayodhya Ram Mandir | న్యూఢిల్లీ: ఏటా శ్రీరామనవమినాడు అయోధ్యలో రాముడి నుదుటపై సూర్య కిరణాలు ప్రసరించేలా ఆలయ నిర్మాణం జరుపుకుంటున్నది. రామ నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు మొదలై 6 నిమిషాలపాటు సూర్య కిరణాలు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహం నుదిటిపై ప్రసరించేలా సీఎస్ఐఆర్కు చెందిన ‘సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (సీబీఆర్ఐ) సైంటిస్టులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశారు. పాణిగ్రాహి నేతృత్వంలోని బృందం ఈ వ్యవస్థకు రూపకల్పన చేసింది.
సీబీఆర్ఐ సైంటిస్టు ఆర్ ధర్మరాజు మాట్లాడుతూ, ‘సూర్య కిరణాలు మూడో అంతస్తుపై ఉండే శిఖరం నుంచి గర్భగుడిలోని విగ్రహంపై ప్రసరిస్తాయి. ఆలయం నిర్మాణం పూర్తయిన తర్వాతే ‘సూర్య తిలకం’ ఆవిష్కృతం అవుతుంది’ అని చెప్పారు. ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్’ నుంచి సీబీఆర్ఐ సైంటిస్టులు సాయం తీసుకున్నారు. కావాల్సిన వస్తువులను, పరికరాలను బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆప్టిక్’ సంస్థ తయారుచేసింది.