Aadhar | బ్యాంకు రుణం లభించాలన్నా.. సంక్షేమ పథకాలు అందాలన్నా.. వంటగ్యాస్, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్.. ఇలా ఏది కావాలన్నా.. అడిగేది ఒక్కటే. అదే పన్నెండంకెల ఆధార్. దేశీయ పౌరులకు విస్తృత ప్రయోజనాలు కల్పిస్తున్న ఈ ‘ఆధారం’ ఇప్పుడు అదే పౌరుల గోప్యతను బజారులో పెట్టనున్నది. కారణం.. ప్రైవేటు సంస్థలు కూడా ఆధార్ సమాచారాన్ని వాడుకోడానికి కేంద్రం తలుపులు తెరువాలనుకోవడమే!
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): దేశ పౌరుల విశిష్ట గుర్తింపు కార్డు ఆధార్ వివరాలను వాడుకొనే అధికారం ఇప్పటివరకూ ప్రభుత్వశాఖలకు మాత్రమే ఉంది. అయితే, ఆ పరిధిని విస్తృతం చేస్తూ ప్రైవేటు సంస్థలు కూడా ఆధార్ను వాడుకొనేందుకు అవకాశం కల్పించేలా చట్టంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ప్రజా సంక్షేమం, సుపరిపాలన వ్యవహారాల కోసం ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్టు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు మే 5లోపు ప్రైవేటు కంపెనీలు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ వివరాలను ప్రైవేట్ సంస్థలు వాడుకోవడం రాజ్యాంగవిరుద్ధమని, పౌరుల వ్యక్తిగత గోప్యత వారి ప్రాథమిక హక్కేనంటూ గతంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించినప్పటికీ, కేంద్రం ఏకపక్షంగా ముందుకు వెళ్తుండటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పౌరుల ఆధార్ వివరాలు ప్రైవేట్ కంపెనీలకు చేరితే పలు నష్టాలు వాటిల్లవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రారంభం: 28 జనవరి 2009
జారీ చేసిన కార్డులు: 136 కోట్లు
ఖర్చు: రూ. 13 వేల కోట్లు
2006లో అప్పటి బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ ‘జాతీయ గుర్తింపు నమోదు’ పేరిట ఆధార్ తరహా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి పౌరుడికి చెందిన పది చేతి వేళ్ల ముద్రలు, ఐరిస్ డేటా, ఫొటో సహా 60కి పైగా అంశాలను పేర్కొంటూ విస్తృత సమాచారాన్ని సేకరించారు. తొలుత ఈ వివరాలు ఇవ్వడాన్ని స్వచ్ఛందమేనని ప్రకటించి తర్వాత తప్పనిసరి చేశారు. ప్రైవేటు సంస్థలకు కూడా సమాచారాన్ని చేరవేయడం ప్రారంభించారు. దీంతో పెద్దయెత్తున వ్యతిరేకత ఎదురైంది. 2010లో అధికారంలోకి వచ్చిన డేవిడ్ కామెరూన్ ఈ చట్టాన్ని రద్దు చేసి.. పౌరుల సమాచారం నిక్షిప్తం చేసిన 500కు పైగా హార్డ్డిస్క్లను ధ్వంసం చేశారు. సర్వర్ల నుంచి డాటాను తొలగించకపోతే, కఠిన చర్యలు తీసుకొంటామని ప్రైవేట్ సంస్థలను హెచ్చరించారు. దీంతో వాళ్లు కూడా తొలగించారు.