కనౌజ్, ఆగస్టు 1: ధరల పెరుగుదలపై ప్రధాని మోదీకి ఉత్తరప్రదేశ్కి చెందిన ఓ ఆరేండ్ల చిన్నారి చెంపపెట్టు లాంటి ఓ లేఖ రాసింది. పెన్సిల్, రబ్బర్ ధరలు పెరిగాయని, ఇది తనకు చాలా ఇబ్బందికరంగా మారిందని, ఓసారి పెన్సిల్ పోగొట్టుకోవడంతో తల్లి చీవాట్లు పెట్టిందని కనౌజ్ జిల్లాలోని ఛిబ్రమౌ పట్టణానికి చెందిన కృతీ దూబే అనే ఒకటో తరగతి విద్యార్థిని ఆ లేఖలో పేర్కొన్నది. స్కూళ్లో పెన్సిల్ పోగొట్టుకున్నానని తెలిసి తన తల్లి మందలించిందని, ఇలా ధరలు పెంచేస్తే ఎలా? అని ఆ బాలిక మోదీని లేఖలో నిలదీసింది. హిందీలో రాసివున్న ఈ లేఖ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
గతంలో తాను ఎన్నోసార్లు పెన్సిల్ పోగొట్టుకున్నా కోప్పడని తల్లి.. ఇప్పుడెందుకు చీవాట్లు పెట్టింది? అని ఆ చిన్నారి ఆలోచించింది. పెన్సిల్ ధర పెరుగడమే ఇందుకు కారణమని తెలుసుకున్న ఆ పాప.. నేరుగా పెన్ను, పేపర్ తీసుకొని మోదీకి ఘాటు లేఖ రాసింది. ‘నా పేరు కృతీ దూబే. ఒకటో తరగతి చదువుతున్నాను. మోదీగారూ మీరు ధరలు బాగా పెంచుతున్నారు. నా పెన్సిల్, రబ్బర్ ధర కూడా పెరిగింది. వీటిని పోగొట్టుకుంటే అమ్మ నన్ను కొడుతున్నది. మరెప్పుడైనా తరగతి గదిలో ఎవరైనా నా పెన్సిల్ దొంగిలిస్తే ఏం చేయాలి?’ అని పాప లేఖలో ప్రశ్నించింది. మరోవైపు మ్యాగీ కూడా బాగా పెరిగిందంటూ అందులో ప్రస్తావించింది. ఈ లేఖ తన కూతురి ‘మన్కీబాత్’ అని కృతీ దూబే తండ్రి, అడ్వకేట్ కూడా అయిన విశాల్ దూబే అన్నారు.