లైంగికదాడులు, బలవంతపు శృంగారానికి సంబంధించిన కేసుల్లో పలు రాష్ట్ర హైకోర్టులు ఇటీవలి కాలంలో వెలువరించిన తీర్పులు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా మారిటల్ రేప్ను నేరంగా పరిగణించలేమని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో వివాదాస్పదమైన పలు తీర్పులను పరిశీలిస్తే..
భార్యతో బలవంతపు శృంగారం రేప్ కాదు
రాయ్పూర్: చట్టబద్ధ వివాహంలో బలవంతపు శృంగారాన్ని లైంగికదాడిగా పరిగణించలేమని ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్య అభీష్టంతో సంబంధంలేకుండా భర్త బలవంతంగా శృంగారాన్ని జరుపడం నేరంగా చూడలేమన్నది. భార్య వయసు 18 సంవత్సరాల లోపు లేకపోతే అలాంటి చర్యను రేప్గా పరిగణించడానికి వీల్లేదని తెలిపింది. తనకు ఇష్టంలేకున్నా భర్త బలవంతపు శృంగారానికి పాల్పడుతున్నాడని ఛత్తీస్గఢ్ యువతి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎన్కే చంద్రవంశీ నేతృత్వంలోని ధర్మాసనం.. ‘ఫిర్యాదుదారును నిందితుడు చట్టబద్ధంగా పెండ్లి చేసుకున్నాడు. కాబట్టి బలవంతంగా లేదా ఇష్టానికి వ్యతిరేకంగా అతడు జరిపిన శృంగారం లేదా లైంగికచర్యను నేరంగా చూడలేం’ అని పేర్కొన్నది. అయితే, భార్య రహస్య అవయవాల్లో నిందితుడు వస్తువులను చొప్పించి అసహజ శృంగారానికి పాల్పడటాన్ని ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం నేరంగా పరిగణిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. భారత్ సహా 32దేశాల్లో మారిటల్ రేప్ నేరం కాదు.
ఐఐటీ విద్యార్థికి ‘టాలెంట్’ పేరుతో బెయిల్
ఐఐటీ గువాహటికి చెందిన ఓ విద్యార్థి సహ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదైంది. అతడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకొన్నాడు. కేసు గువాహటి హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జడ్జి అజిత్.. ‘సాక్ష్యాధారాలన్నీ నిందితుడికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అతడు ఉన్నత చదువులో ఉన్నాడు. అతడు అస్సాం రాష్ట్ర భావి సంపద’ అని వ్యాఖ్యానించారు. నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు.
లైంగిక దాడి తర్వాత నిద్ర ఎలా పడుతుంది..
పెండ్లి చేసుకొంటానని నమ్మించి లైంగికదాడి చేశాడంటూ కర్ణాటకలో కేసు నమోదైంది. నిందితుడు ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లాడు. కేసు గతేడాది జూన్లో కర్ణాటక హైకోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా బాధితురాలు.. లైంగికదాడి తర్వాత అలసిపోయానని, నిద్రపట్టిందని చెప్పడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘భారతీయ మహిళ అలా నిద్రపోదు’ అని వ్యాఖ్యానించింది. బాధితురాలిపై అనుమానం వ్యక్తంచేసింది. నిందితుడికి బెయిల్ ఇచ్చింది.
ఆడవారి మాటలకు అర్థాలు వేరు
ఆడవారి మాటలకు అర్థాలు వేరు.. అని పాట విని ఉంటాం. కానీ సాక్షాత్తూ ఓ కేసు విచారణలో సుప్రీంకోర్టే ఈ వ్యాఖ్యలు చేసింది. పీప్లీ లైవ్ కో-డైరెక్టర్ ఫారూకీ తనపై లైంగికదాడి చేశాడంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించారు. 2018లో కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ‘కొన్ని సందర్భాల్లో ఆడవారి మాటలను బట్టి వారిని అర్థం చేసుకోలేం. వద్దు అంటే నిజానికి ఆమెకు సమ్మతమే అన్న అర్థం కూడా ఉండి ఉండవచ్చు’ అని వ్యాఖ్యానింది. ఫారూకీని నిర్దోషిగా ప్రకటించింది.
శరీరాన్ని నేరుగా తాకితేనే..
బాలిక రొమ్మును తాకాడంటూ ఓ వ్యక్తిపై లైంగిక దాడి కేసు నమోదైంది. ఈ ఏడాది జనవరిలో ఈ కేసు బాంబే హైకోర్టులో విచారణకు వచ్చింది. ‘నిందితుడు బాధితురాలి శరీరాన్ని నేరుగా తాకకపోతే పోక్సో చట్టం ప్రకారం అది లైంగిక దాడి కాదు’ అని కోర్టు తీర్పునిచ్చింది.
వారిని రేప్ చేయరు
1992లో భన్వరీదేవీపై లైంగికదాడి కేసు రాజస్థాన్లో ప్రకంపనలు సృష్టించింది. తనపై గుజ్జర్ కులానికి చెందిన ఐదుగురు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారని ఓ మహిళ కోర్టుకెళ్లారు. ఈ కేసుపై రాజస్థాన్ ట్రయల్ కోర్టు జడ్జి.. ‘ఉన్నత కులాలకు చెందిన పురుషులు తక్కువ కులం అమ్మాయిలపై లైంగిక దాడి చేసి తమను తాము అపవిత్రం చేసుకోరు’ అని వ్యాఖ్యానించారు.