చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒక్క సీటు గెలిచినా అది బీజేపీ ఎమ్మెల్యే విజయమే అవుతుందని డీఎంకే చీఫ్ స్టాలిన్ అన్నారు. కాంచీపురంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార అన్నాడీఎంకేపై మండిపడ్డారు. మొత్తం 234 స్థానాల్లో తమ పార్టీ 200 స్థానాల్లో గెలుస్తుందని తాను మొదటి నుంచి చెబుతున్నానని స్టాలిన్ అన్నారు. అయితే ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ను పరిశీలించిన తర్వాత మొత్తం 234 స్థానాల్లో డీఎంకే కూటమి గెలిచే అవకాశమున్నదని తెలిపారు.
ఒకవేళ అన్నాడీఎంకే సింగిల్ స్థానంలో గెలిచినా అది అన్నాడీఎంకే ఎమ్మెల్యే విజయం కాదని బీజేపీ ఎమ్మెల్యే విజయం అవుతుందని స్టాలిన్ అన్నారు. డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం కుమారుడు ఒక్కరే అన్నాడీఎంకే ఎంపీగా ఉన్నారని, కానీ ఆయన బీజేపీ ఎంపీగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి చెందిన మరో బ్రాంచ్ అన్నాడీఎంకే అని విమర్శించారు. అందుకే మనం బీజేపీని గెలువనివ్వకూడదు, అన్నాడీఎంకేకు మళ్లీ అధికారం దక్కనీయకూడదని, ప్రజలంతా ఇది గుర్తుంచుకోవాలని స్టాలిన్ తెలిపారు.