టెహ్రాన్, జూలై 3: అమెరికా-ఇరాన్ యుద్ధం తొలిరోజే దివంగతుడైన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ శుక్రవారం ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజుల తరబడి జరిగే అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్కు మద్దతుగా ప్రజలంతా ఏకం కావాలని కోరుతూ రాజధాని టెహ్రాన్ అంతటా బ్యానర్లు వెలిశాయి. 1989లో సుప్రీం లీడర్ అయతొల్లా రుహొల్లా ఖొమేనీ అంత్యక్రియలకు దీటుగా రాజధాని వీధుల్లోకి లక్షలాది మంది ప్రజలు పోటెత్తాలని ఇరాన్ పాలకులు కోరుతున్నారు. అలా చేస్తే తమ ప్రభుత్వానికి ఎంతో శక్తినిచ్చినట్టు అవుతుందని ఇరాన్ ఒక విధంగా అగ్రరాజ్యం అమెరికా ముందు బలప్రదర్శన జరపాలని పాలకులు అనుకుంటున్నారు.
ప్రజాబలం, పాలకులకు వారి ఇచ్చే మద్దతును తెలియజేయడం ద్వారా భవిష్యత్లో ఇజ్రాయెల్ నుంచి దాడుల విషయంలో రక్షణ, హొర్ముజ్ జలసంధిపై తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు, అమెరికాతో యుద్ధం శాశ్వతంగా ముగించేందుకు జరిగే చర్చల్లో నైతికంగా బలం చేకూరుతుందని ఇరాన్ భావిస్తున్నది. కాగా, యుద్ధం ప్రారంభమైన కొన్ని నెలల తర్వాత ఇరాన్ పారా మిలిటరీ రివల్యూషనరీ గార్డుకు చెందిన ఒక శక్తిమంతమైన జనరల్ బహిరంగంగా ఈ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరవుతారని తెలిసింది. అలాగే ఇరాన్ శక్తిని ప్రపంచ దేశాలకు చాటేందుకు మరికొందరు ముఖ్యమైన నేతలు, అధికారులు కూడా విదేశీ ప్రతినిధులతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిసింది.
ఖమేనీ అంత్యక్రియల్లో హాజరయ్యేందుకు భారత్ నుంచి బయలుదేరిన అధికారిక బృందం టెహ్రాన్కు చేరుకుంది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అత్-షస్నైన్లు భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. వీరితో పాటు భారత్కు చెందిన మతపెద్దలతో కూడిన బృందం కూడా ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు చేసిందని స్థానిక మీడియా పేర్కొన్నది.