Home Minister Amit Shah | అమిత్షా.. కేంద్ర హోంమంత్రి.. మంగళవారం గోవాలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ బాటిల్స్ను కాదని.. తాను రోజు వాడే వాటర్ బాటిల్ కావాలని అడిగారు. ఆ వాటర్ బాటిల్ ఖరీదు తెలుసుకుని గోవా వ్యవసాయ మంత్రి రవి నాయక్ అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ బాటిల్ ఖరీదు అక్షరాల రూ.850. ఆ చుట్టుపక్కల ఎక్కడా వెతికినా ఈ వాటర్ బాటిల్ దొరకలేదు. ఎట్టకేలకు గోవా రాజధాని పనాజీకి 15 కి.మీ దూరంలోని మపుసాలో దొరకడంతో మంత్రి రవినాయక్ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వాటర్ బాటిల్ను ఉద్దేశించి రవి నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్షపు నీటిని కాపాడుకోవాలని కోరారు. గోవాలోని స్టార్ హోటళ్లలోనే మినరల్ వాటర్ బాటిల్ ధరలు రూ.150-160 పలుకుతాయన్నారు. హోంమంత్రి అమిత్షా వాడుతున్న వాటర్ బాటిల్ ధర రూ.850. అంటే నీరు ఎంత ఖర్చుతో కూడుకున్నదో ఈ ఘటన చెబుతుందని రవి నాయక్ తెలిపారు.
రవి నాయక్ ఇంతకుముందు కూడా రెండు సార్లు గోవాలో కురుస్తున్న వర్షపు నీటిని నిల్వ చేసి, గల్ఫ్ దేశాలకు ఆయిల్కు బదులు నీరు ఎగుమతి చేయాలన్నారు. నీటిని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో నీటి ఆధారిత ఉత్పత్తులు బంగారం, వజ్రాల మాదిరిగా విలువైనవిగా మారతాయని జోస్యం చెప్పారు.
ప్రభుత్వం రాష్ట్రమంతటా పర్వతాలు ఉన్న ప్రాంతాల్లో రిజర్వాయర్లు నిర్మించి నీటిని నిల్వ చేయాలని రవి నాయక్ అన్నారు. ప్రతియేటా గోవాలో సుమారు 120 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నీటి కోసం ప్రజలు కొట్టుకునే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత నెలలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ జల వనరులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే, దేశవ్యాప్తంగా డ్యామ్లు నిర్మించి నీళ్లు నిల్వ చేయొచ్చునన్నారు. ఇంధనానికి బదులుగా గల్ఫ్ దేశాలకు నీటిని ఎగుమతి చేయవచ్చునని చెప్పారు.