న్యూఢిల్లీ, జూలై 13: అంతర్జాతీయ వేదికపై మోదీ సర్కార్ మరోసారి భారత పరువును పోగొట్టింది. భారత అంతర్గత విషయాలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విదేశాలు జోక్యం చేసుకుంటున్నాయి. రెండు నెలలుగా నిప్పుల కొలిమిని తలపిస్తున్న మణిపూర్ అంశంపై మోదీ సర్కార్ మౌనం వహిస్తుండడంతో అంతర్జాతీయంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అమెరికా రాయబారి మణిపూర్లో శాంతిని నెలకొల్పేందుకు సహకరిస్తామని పేర్కొనగా, తాజాగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంట్లో ఈ అంశం చర్చకు వచ్చింది. ఈయూ సభ్యులు దీనిపై పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. భారత్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఈయూ పార్లమెంట్ విచారం వ్యక్తం చేసింది. ఉపా తదితర చట్టాల దుర్వినియోగంపై ఆవేదన వ్యక్తం చేసింది. మైనారిటీలపై దాడులను ఖండించింది. మణిపూర్లో చెలరేగిన రాజకీయ ప్రేరేపిత అల్లర్లను అదుపు చేయాలని ఈయూ పార్లమెంట్ తీర్మానం చేసింది. భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన వేళ ఈయూ పార్లమెంట్లో మణిపూర్ అంశంపై తీర్మానాలు ప్రవేశపెట్టడం చర్చనీయాంశమైంది.
ఈయూలోని 80 శాతం సభ్యులు ఈ తీర్మానానికి ఆమోదం తెలిపారు. లెఫ్ట్ గ్రీన్ యూరోపియన్ ఫ్రీ అలయన్స్, ఈపీపీ, ఎస్ అండ్ డీ, ఈసీఆర్ తదితర పార్టీలకు చెందిన సభ్యులు దీనికి మద్దతు పలికారు. మెజారిటీ ప్రజలను ప్రోత్సహించే రాజకీయ ప్రేరేపిత, బీజేపీ విభజన విధానాలపై ఈయూ పార్లమెంట్ ఆందోళన వ్యక్తం చేసింది. హింసను ప్రేరేపించే ఉద్రేకపూరిత ప్రకటనలు మానుకోవాలని బీజేపీ నేతలకు హితవు పలికింది. ఇంటర్నెట్ షట్డౌన్ ద్వారా మీడియా విధులకు ఆటంకం కలిగించి, వాస్తవాలు బయటికి రాకుండా అడ్డుకుంటున్నారని ఈయూ పార్లమెంట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో… భారత్లో మానవ హక్కుల ఉల్లంఘనలు, మైనారిటీలపై దాడుల అంశాలు చర్చకు వస్తున్నాయి. మోదీతో ఈ అంశాలపై చర్చించాలని అమెరికా చట్ట సభ సభ్యులు బైడెన్కు లేఖలు రాసి ఇటీవల ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు. తాజాగా ఈ అంశంపై మోదీతో చర్చించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడిపై ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈయూ పార్లమెంట్లో జరిగిన చర్చే దీనికి నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు.