Medicine Prices | న్యూఢిల్లీ, మార్చి 29: దేశంలో ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) ఔషధాల టోకు ధర సూచికలో వార్షిక సవరణ చేసింది. దీంతో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్(ఎన్ఎల్ఈఎం) జాబితాలో ఉన్న మందులపై 0.0055 శాతం ధరలు పెరగనున్నాయి.
ధరల పెరుగుదల ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నది. పారాసిటమాల్, అజిత్రోమైసిన్ వంటి 800కు పైగా యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫెక్టివ్, పెయిన్ కిల్లర్, స్టెరాయిడ్ల ధరలు పెరగనున్నాయి. అయితే, మందుల ధరలు గతేడాది 12 శాతం, 2022లో 10 శాతం పెరిగినందున, వాటితో పోల్చుకుంటే ఈసారి పెరుగుదల స్వల్పంగా ఉండటం కొంత ఊరట కలిగించే అంశం.