న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: తెలంగాణతోపాటు పలు రాష్ర్టాల్లో కొత్త దవాఖానలు ఏర్పాటు చేయాలని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్లో 350 పడకల దవాఖాన, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లో ఒక్కొక్కటి చొప్పున 100 పడకల హాస్పిటళ్లను ఏర్పాటు చేయనున్నది. కార్మికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈఎస్ఐసీ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
తెలంగాణలోని శంషాబాద్లో ప్రతిపాదిత 100 పడకల దవాఖాన ఏర్పాటుకు చండీగఢ్లో జరిగిన 190వ ఈఎస్ఐసీ సమావేశంలో ఆమోదం తెలిపారు. సిక్కింలోని రంగ్పోలో ఉన్న 30 పడకల ఈఎస్ఐసీ హాస్పిటల్ను 100 పడకల దవాఖానగా ఆధునీకరించనున్నారు. ఇంకా ఏపీలో విజయవాడలోని గుణదల, జార్ఖండ్లో రాంచీలోని మైథాన్ ఈఎస్ఐసీ దవాఖానలను కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్టు కేంద్ర కార్మికశాఖ వెల్లడించింది.
ఈఎస్ఐ దవాఖానకు ఐదెకరాలు కేటాయించాం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని గోల్కొండ వద్ద ఈఎస్ఐ దవాఖాన నిర్మాణానికి ఐదెకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈఎస్ఐ దవాఖాన ఏర్పాటుకు అనుమతి వచ్చింది. త్వరలోనే దవాఖాన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది.
-మంత్రి చామకూర మల్లారెడ్డి