న్యూఢిల్లీ : బీజేపీయేతర శిబిరంలోని విభేదాలను ప్రతిపక్షాల కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా కుటుంబ కలహాలుగా అభివర్ణించారు. 2024 సవాల్ కోసం తామంతా ఏకమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నాన్నారు. ప్రతిపక్షం ఏకపక్ష పాలనను కోరుకోవడం లేదని, రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంస్థలను రక్షించాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆల్వా ఎన్డీయే కూటమి అభ్యర్థి జగ్దీప్ ధన్కర్పై పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ ‘విషాదం’ ఏంటంటే.. ప్రజల ఆదేశం ప్రబలంగా లేదన్నారు. ప్రతిపక్షాలను ఏకం చేసే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలన్న తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయంపై తాను విస్మయం చెందానన్నారు. ఆమె బీజేపీని గెలిపించే అవకాశం లేదని అల్వా అన్నారు. మమతా బెనర్జీ మనసు మార్చుకోవడానికి తగినంత సమయం ఉందన్నారు.