న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ‘భారతీయులకు ఇంగ్లిష్ను దూరం చేయాలి.. అసలు ఆ భాషను వాడకుండా చూడాలి.. విద్యార్థులకు హిందీ, స్థానిక భాషల్లోనే బోధన చేపట్టాలి.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంగ్లిష్ అన్నదే కనిపించకూడదు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే హిందీ నేర్చుకోవాల్సిందే.. కాదూకూడదు అంటే వారికి శిక్ష కూడా విధించాలి.. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ హిందీలోనే ఉండాలి’.. ఇవీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ చేసిన ప్రతిపాదనలు. ప్రజలపై హిందీని రుద్దేందుకు ఆ కమిటీ మొత్తం 112 సిఫారసులతో 11వ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఆ నివేదికలో.. టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యాసంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో హిందీ, స్థానిక భాష మాత్రమే వాడేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇంగ్లిష్ లేకపోతే పోటీ ప్రపంచాన్ని తట్టుకోవటం సాధ్యం కాదని పలువురు విద్యార్థులు, అధ్యాపకులు, విద్యానిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్జెక్ట్ ఉండీ ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఎంతోమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని చెప్తున్నారు. ప్రపంచంతో పోటీ పడే నిర్ణయాలు తీసుకోవాలి గానీ, భావిభారత పౌరుల జీవితాలతో ఆటుకోవటం ఏమిటని అమిత్షా నేతృత్వంలోని కమిటీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో చదువుకొనేందుకు, ఉద్యోగం చేసుకొనేందుకు ఇంగ్లిష్ తప్పనిసరి అని, ఇలాంటి నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తాయని మండిపడుతున్నారు.
హిందీని తప్పనిసరి చేయాలన్న పార్లమెంటరీ కమిటీ నిర్ణయాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ తప్పుబట్టారు. ఇలాంటి చర్యలతో భాషాయుద్ధానికి తెర తీయవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. కామన్ లాంగ్వేజీని అమలు చేయటం భారత్లో ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. కమిటీ ప్రతిపాదనలను అమలు చేస్తే హిందీ మాట్లాడేవారిని అసలైన భారతీయులుగా, మాట్లాడలేనివారిని తక్కువ స్థాయి పౌరులుగా చూసే ప్రమాదం ఉందని అన్నారు. రాజ్యాంగం కల్పించిన భిన్నత్వంలో ఏకత్వం సిద్ధాంతాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలని తేల్చి చెప్పారు. హిందీని రుద్ది వేరే భాషాయుద్ధాన్ని ప్రారంభించేలా చేయవద్దని హెచ్చరించారు.
లోక్సభ నుంచి.. 20 మంది
రాజ్యసభ నుంచి.. 10 మంది
మొత్తం : 30 మంది
టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్:
ఐఐటీలు, ఐఐఎంలు, ఏఐఐఎంలు
నాన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్:
కేంద్రియ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు