(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను వేధించడానికి ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నదనే దాన్ని కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలే పరోక్షంగా బయట పెట్టాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దర్యాప్తు సంస్థలను ఏ తీరుగా భ్రష్టు పట్టించిందో నమోదు అయిన కేసుల తీరే నిదర్శనం. రాజ్యాంగబద్ధంగా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate- ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఇన్కమ్ టాక్స్(ఐటీ) సంస్థలు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారి బీజేపీయేతర రాష్ర్టాలను, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నదని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు ఆర్థికశాఖ గణాంకాలు మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయి.
బీజేపీ అధికారంలోకి వచ్చాక పెరిగాయి
బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ), విదేశీ మారక నిర్వహణ చట్టం(ఎఫ్ఈఎంఏ) కింద పలువురు వ్యక్తులు, రాజకీయ నాయకులపై కేసుల నమోదు భారీగా పెరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. 2018-19, 2021-22 మధ్య నాలుగేండ్ల కాలంలో ఈడీ నమోదు చేసిన కేసుల సంఖ్య 605 శాతం పెరిగింది. 2018-19లో 195 కేసులు నమోదు చేయగా, 2021-22లో ఈ సంఖ్య 1,180కి చేరుకొన్నది.
95,432 కోట్ల ఆస్తుల జప్తు
మరోవైపు ఈడీ సోదాలు కూడా కాంగ్రెస్ కంటే బీజేపీ హయాంలోనే భారీగా జరిగాయి. 2004-14తో పోలిస్తే 2014-22 మధ్య 2,655 శాతం అధికంగా ఈడీ సోదాలు చోటుచేసుకొన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం.. 2004-14 మధ్య ఈడీ కేవలం 112 చోట్ల సోదాలు జరుపగా, రూ.5,346 కోట్ల మేర ఆస్తులను జప్తు చేసింది. అదే బీజేపీ హాయాంలో 2014-22 మధ్య సోదాల సంఖ్య భారీగా 2,974కి పెరిగింది. ఈ ఎనిమిది ఏండ్ల కాలంలో అధికారులు రూ.95,432 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు.