న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. దీంతో గురువారం పదవీ విరమణ చేయాల్సిన ఆయన 2022 నవంబర్ 18 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. సీబీఐ, ఈడీ చీఫ్ల పదవీ కాలం రెండేండ్లు. అయితే వీరి పదవీ కాలాన్ని ఏడాది చొప్పున గరిష్ఠంగా ఐదేండ్ల వరకు పొడిగించేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇది జరిగిన రెండు రోజుల్లో గురువారం రిటైర్ కానున్న ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించింది.
కాగా, 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన సంజయ్ కుమార్ మిశ్రాకు రెండేండ్ల నిర్ణీత పదవీకాలం 2020లో పూర్తి కాగా కేంద్రం ఇప్పటికే ఒక ఏడాది పొడిగించింది. సుప్రీంకోర్టులో దీనిని సవాల్ చేయగా కేంద్రం ఆర్డర్లో జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది. అయితే ఈ ఏడాది నవంబర్ 17 తర్వాత ఆయన సర్వీస్ను పొడిగించవద్దని పేర్కొంది. అయినప్పటికీ కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం ఈడీ చీఫ్ మిశ్రా పదవీ కాలాన్ని మరోసారి ఏడాదిపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.