Enforcement Directorate | మనీలాండరింగ్ కేసులో ఎన్సీపీ మాజీ ఎంపీకి చెందిన రూ.315 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసింది. పలు నగరాల్లో ఉన్న 70 ఆస్తులను ఈడీ జప్తు చేసింది. బ్యాంకు ఫ్రాడ్ కేసులో ఈడీ ఈ చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ కేసులో ఎన్సీపీ మాజీ రాజ్యసభ ఎంపీ ఈశ్వర్లాల్ శంకర్లాల్ జైన్ లాల్వానీ ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది. లాల్వానీ రాజ్మల్ లఖిచంద్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్ఎల్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, మన్రాజ్ జ్యువెలర్స్ ప్రమోటర్గా ఉన్నారు. ఆయనపై బ్యాంకుల మోసం, మనీలాండరింగ్ తదితర అభియోగాలు సైతం ఉన్నాయి. అయితే, ఈడీ జల్గావ్, ముంబయి, సిలోడ్, కచ్లో ఉన్న లాల్వానీ, ఆయన కంపెనీలకు చెందిన ఆస్తులను అటాచ్ చేసింది.
స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో భారీ మొత్తంలో కరెన్సీతో పాటు బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని, వాటి విలువ రూ.315కోట్లు ఉంటుందని అంచనా. మనీలాండరింగ్ నిరోధక చట్టం కేసులో సీబీఐ మూడు ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. కంపెనీల ప్రమోటర్లు తప్పుడు పత్రాలు ఇవ్వడంతో పాటు ఆర్థిక వివరాలను పెంచి చూపేందుకు రౌండ్ ట్రిప్ లావాదేవీలు జరుపడం, ఆడిటర్లతో కుమ్మక్కు కావడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.352 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. నకిలీ పత్రాలతో రుణాలు తీసుకొని తారుమారు చేశారని ఈడీ ఆరోపిస్తున్నది. నిందితులు రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో సైతం అక్రమంగా పెట్టుబడులు పెట్టారంటూ ఆగస్టులో ఈడీ దాడులు నిర్వహించింది.