శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని బండిపోరాలోని సాలిందర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఆ తర్వాత పెద్ద భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. చొరబాట్ల నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. నియంత్రణ రేఖ వెంట భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా, హతమైన ఉగ్రవాది నుంచి రైఫిల్, మూడు మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బందిపొరాలోకి ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి. కోటసత్రి జంగిల్, గుండ్పోరా జంగిల్, యాటు, క్విల్ముకం వంటి ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలున్నాయనే సమాచారం మేరకు పెద్ద ఎత్తున ఆపరేషన్లు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా పలు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. నాలుగు రోజుల కిందట రాజోరిలో నియంత్రణ రేఖ వెంట చొరబాటు దారుడు హతమయ్యాడు. నౌషేరా ప్రాంతంలోని లామ్ సెక్టార్లో చొరబాటుకు యత్నిస్తుండగా ఓ ఉగ్రవాదిని సైన్యం హతమార్చింది. అతని నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నది.