Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య శనివారం కాల్పులు జరుగుతున్నాయి. రాజౌరి పరిధిలోని డోరిమల్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ సాగుతోంది. ఈ ప్రాంతంలో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది.
దీంతో వారిని పట్టుకునేందుకు, అంతం చేసేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ ప్రాంతం మొత్తాన్ని గాలిస్తున్నాయి. తీవ్రవాదుల కదలికలపై స్పష్టమైన సమాచారం అందడంతో పోలీసులు, కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. సోదాలు నిర్వహిస్తుండగా, తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. అయితే, ఇంకా ఉగ్రవాదులు చిక్కలేదు. మరోవైపు గత ఫిబ్రవరిలో ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటన చేసింది. 326 రోజులు శ్రమించిన తర్వాత కిష్ట్వార్ ప్రాంతంలో తీవ్రవాద నెట్వర్క్ను అంతం చేశామని ప్రకటించింది.
ఇటీవల ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ.. ఒకవేళ పాకిస్తాన్ ఇలాగే ఉగ్రవాదుల్ని పెంచుకుంటూ, ఇండియాపైకి పంపిస్తే భారత్ తీవ్రంగా స్పందిస్తుందన్నారు. ప్రపంచ పటంలో ఉండాలో లేదో పాకిస్తాన్ తేల్చుకోవాలన్నారు. పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు ఏడాది పూర్తైంది. గత ఏడాది మే 7న ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.