(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. ఏడవ వేతన సవరణ కమిషన్ సిఫారసుల మేరకు అలవెన్సులతో సహా 39 పాయింట్లతో కూడిన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. సమస్యలు పరిష్కరించాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనల్లో భాగంగా ప్రభుత్వ విభాగాలకు చెందిన సుమారు 7.5 లక్షల మంది ఉద్యోగులు ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా మూకుమ్మడి సెలవులు పెట్టారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ తీరుపై నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాన్నీ దాదాపు మూతపడ్డాయి. ప్రతిరోజు కార్యాలయాల వద్ద సమావేశాలు పెట్టి నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఐక్య కమిటీగా ఉద్యోగ సంఘాలు
అటెండర్ స్థాయి నుంచి వివిధ గ్రేడ్ల అధికారులు మధ్యప్రదేశ్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయిస్ యునైటెడ్ ఫ్రంట్ పేరిట ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ క్లరికల్ గ్రేడ్ ఎంప్లాయిస్ యూనియన్, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ యూనియన్, గవర్నమెంట్ డ్రైవర్స్ యూనియన్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిస్ యూనియన్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయిస్ యూనియన్, పార్ట్ టైం వర్కర్ల యూనియన్, మధ్యప్రదేశ్ స్టెనోగ్రాఫర్ల యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, రెవెన్యూ ఎంప్లాయిస్ యూనియన్ తదితర సంఘాలన్నీ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాయి.
ప్రభుత్వానికి 39 డిమాండ్లు
39 పాయింట్లతో కూడిన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా టైమ్ స్కేల్ పే గ్రేడ్, కేంద్ర ప్రభుత్వంతో సమానంగా డీఏ ఇవ్వాలని, గత 11 ఏండ్లుగా పెంపునకు నోచుకోని హెచ్ఆర్ఏ, కన్వీనియన్స్ అలవెన్సు పెంచాలని, పదోన్నతులు కల్పించాలని, పే రివిజన్ కమిషన్ సిఫార్సులన్నింటిని అమలు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగులకూ 4 శాతం డీఏ చెల్లించాలనే డిమాండ్లు ఉన్నాయి. మూకుమ్మడి సెలవు మంజూరు కోసం ఉద్యోగుల అర్జీలను ఉన్నతాధికారులు తోసిపుచ్చడంతో ఉద్యోగులు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రిజస్ట్రేషన్ విభాగం అధికారులు కూడా సమ్మెలో పాల్గొంటున్నట్టు ప్రకటించారు.
పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం
ఉద్యోగుల ఆందోళనల పట్ల శివరాజ్సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తున్నది. గత ప్రభుత్వంపై నెపాన్ని నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నది. ఉద్యోగుల డిమాండ్ల విషయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, గత ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని బీజేపీ నాయకులు అంటుంటే.. బీజేపీ ప్రభుత్వమే ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యహరిస్తున్నదని హస్తం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.