Emerald lingam | ఎమరాల్డ్ లింగం.. దాన్నే తెలుగులో మరకత లింగం లేదా పచ్చ లింగం అని కూడా అంటారు. అది చాలా విలువైనది, మహిమ గలది. ఆ లింగంతో శివుడికి అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనేది కొందరి నమ్మకం. అందుకే.. ఆ లింగానికి ఎక్కువ విలువ ఉంటుంది. ఇటువంటి లింగాలు పాత కాలం నాటి శివుడి గుడులలో ఉంటాయి. వేల ఏండ్ల నాటి గుడులలో ఇవి దర్శనం ఇస్తాయి. కాకపోతే ఈ లింగానికి ఉన్న మహిమ గురించి తెలుసుకొని చాలామంది వాటిని దొంగలించే ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా దక్షిణ భారతంలో 1980 సంవత్సరం నుంచి చాలా మరకత లింగాలు దొంగతనానికి గురయ్యాయి.
తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలోని తిరుకువళై అనే గ్రామంలో ఉన్న శివుడి గుడిలో నుంచి మరకత లింగం మిస్ అయింది. 2016 నుంచి అది కనిపించడం లేదు. దాని కోసం ఇంకా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.
కట్ చేస్తే.. 2022లో అంటే ప్రస్తుతం ఓ మరకత లింగాన్ని పోలీసులు ఒక బ్యాంక్ లాకర్లో ఉన్నట్టు గుర్తించారు. దాని విలువ రూ.500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఓ బ్యాంకు లాకర్లో దాన్ని ఓ వ్యక్తి భద్రంగా దాచాడు. ఆ విషయం పోలీసులకు తెలిసి బ్యాంక్ మీద రైడ్ చేసి.. ఆ మరకత లింగాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దాన్ని ఎవరు దాచారో వాళ్ల అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్లి పోలీసులు ఆరా తీశారు. తంజావూరులోని అరులానంద నగర్లో నివాసం ఉండే ఎన్ఎస్ అరుణ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆ మరకత లింగం గురించి ప్రశ్నించారు.
తనకు లింగం గురించి తెలియదని.. తన తండ్రి సామియప్పన్ దాన్ని బ్యాంక్ లాకర్లో దాచినట్టు అరుణ్ తెలిపాడు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. 8 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ఆ లింగం 530 గ్రాములు ఉందని.. దాని విలువ సుమారు రూ.500 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. 2016లో మిస్ అయిన ఆ మరకత లింగం ఇదేనా కాదా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.