న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్)కు చెందిన కొన్ని అకౌంట్లను నిలిపివేయాలని కోరుతూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రత్యేకమైన అకౌంట్ల నుంచి జరిగే పోస్టులను కూడా ఆపేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నట్లు ఎలన్ మస్క్కు చెందిన సంస్థ వెల్లడించింది. ఎలన్ మస్క్(Elon Musk) సంస్థ చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
ఎక్స్కు చెందిన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ అకౌంట్లో ఈ పోస్టు చేశారు. భారత ప్రభుత్వ ఆదేశాలను మస్క్ కంపెనీ తప్పుపట్టింది. ఆ చర్యలతో ఏకీభవించడం లేదని ఆ కంపెనీ తెలిపింది. భావ స్వేచ్ఛ పేరుతో పోస్టులను విత్హెల్డ్లో పెట్టడం సరికాదు అని ఎక్స్లో ప్రకటన చేశారు. అయినా కానీ భారత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోనున్నట్లు ఆ ట్వీట్లో చెప్పారు.
సర్కారు ఆదేశాల ప్రకారం కేవలం ఇండియాలో మాత్రమే కొన్ని అకౌంట్లు, పోస్టులను హోల్డ్లో పెట్టనున్నట్లు ఎక్స్ వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా.. ఆయా పోస్టులకు భావ స్వేచ్ఛ వర్తిస్తుందని ఆ కంపెనీ తెలిపింది.
ప్రభుత్వ ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటీషన్ ఇంకా పెండింగ్లోనే ఉన్నట్లు ఎక్స్ చెప్పింది. తమ పాలసీ ప్రకారం నిషేధిత యూజర్లకు నోటీసులు ఇచ్చినట్లు కూడా ఎక్స్ వెల్లడించింది. న్యాయపరమైన అవరోధాలు ఉన్న కారణంగా.. ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను పబ్లిష్ చేయడం లేదని ఎక్స్ తెలిపింది. కానీ పారదర్శకత ఉండాలంటే ఆ అంశాలను పబ్లిక్ చేయాల్సి ఉంటుందని, సమాచారాన్ని ఇవ్వకపోవడం బాధ్యతారాహిత్యం అవుతుందని, న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఎక్స్ తన ప్రకటనలో తెలిపింది.