Elgar Parishad Case | సామాజిక కార్యకర్త గౌతమ్ నవ్లఖాకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ను మంజూరు చేసింది. ఎల్గార్ పరిషత్ కేసులో ఆయన అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ వేయగా.. జస్టిస్ ఏఎస్ గడ్కరీ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ నవలఖాకు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే, బెయిల్ ఉత్తర్వులను అమలుపై ఆరువారాల పాటు స్టే విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టును కోరింది. కోర్టు మూడువారాల పాటు స్టే విధించింది. బెయిల్ ఉత్తర్వుల అమలు మూడువారాల పాటు నిలిచిపోనున్నది.
రూ.లక్ష పూచీకత్తుపై కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. నవ్లఖా ఆగస్టు 2018లో అరెస్టయ్యారు. గతేడాది నవంబర్లో ఆయనను గృహనిర్బంధంలో ఉంచేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆయన ప్రస్తుతం నవీ ముంబయిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎల్గార్ పరిషత్ కేసులో ఏడుగురికి బెయిల్ లభించినట్లయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గౌతమ్ నవ్లఖాకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. నిషేధిత మావోయిస్ట్ సంస్థలు క్రియాశీలక సభ్యుడిగా ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు పేర్కొంది. ప్రత్యేక కోర్టు తీర్పును ఆయన బాంబే హైకోర్టులో సవాల్ చేశారు.
2017, డిసెంబర్ 31న పుణేలో జరిగిన ఎల్గార్ పరిషత్ సదస్సులో ఉద్రేకపూరిత ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆ తర్వాత కోరేగావ్ బీమాలో హింస చెలరేగిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో 16 మందిని అరెస్టు చేయగా.. ఇప్పటి వరకు ఐదుగురు ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చారు. ఇందులో సామాజిక కార్యకర్త ఆనంద్ తెల్తుంబ్డే, న్యాయవాది సుధా భరద్వాజ్, వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరా, మహేష్ రౌత్ సాధారణ బెయిల్పై బయట ఉన్నారు. ప్రజా కవిత వరవరరావు ఆరోగ్య కారణాలతో బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో బెయిల్ పొందిన ఏడో నిందితుడు నవ్లఖా.