Elephant : ఏనుగు (Elephant) పగబట్టి ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. పగబట్టి వెంటాడింది. ఈ క్రమంలో 14 ఏళ్ల క్రితమే ఇద్దరిని చంపేసింది. దాంతో భయపడిన ఆ కుటుంబం ఊరి వదిలిపోయి వేరే ఊళ్లో మకాం పెట్టింది. అయినా ఆ కుటుంబాన్ని పసిగట్టి మరో ఇద్దరిని చంపేసింది. దాంతో ఆ ఏనుగు దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లు అయ్యింది. ఈ హృదయవిదారక ఘటన నేపాల్ (Nepal) లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నేపాల్లోని చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో నివసించే శనిచర బోటే కుటుంబానికి ‘ధ్రుబే’ అనే ఏనుగు రూపంలో మృత్యువు వేటాడింది. 2012 డిసెంబర్లో మాడి అనే పట్టణంలో ధ్రుబే ఏనుగు దాడిచేసి శనిచర తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన శనిచర.. తన కుటుంబాన్ని ఈ ప్రమాదం నుంచి కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాప్తి నది దాటి దాదాపు 9 మైళ్ల దూరంలోని జగత్పూర్కు తన నివాసాన్ని మార్చాడు.
ఇక తమకు ఆ ఏనుగు నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని భావించాడు. అయితే విధి వారిని వెక్కిరించింది. 14 ఏళ్ల తర్వాత అదే ధ్రుబే ఏనుగు వాసనతో పసిగట్టి వారిని వెతుక్కుంటూ వచ్చింది. ఈ నెల ఆరంభంలో జగత్పూర్లోని శనిచర ఇంటిపై దాడిచేసి, అతని 25 ఏళ్ల కోడలు ఆషికా బోటేను, 4 ఏళ్ల మనవడు భరత్ బోటేను అతి కిరాతకంగా చంపేసింది. ఈ ఘటనతో శనిచర బోటే కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ‘నదులు దాటి ఇంత దూరం వస్తే మమ్మల్ని ఏమీ చేయలేదని అనుకున్నాం. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత అదే ఏనుగు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నా కోడలిని, మనవడిని బలిగొంది. ఇక పారిపోవడానికి చోటు కూడా లేదు’ అంటూ ఆయన కన్నీరుమున్నీరయ్యారు.
ధ్రుబే ఏనుగు నేపాల్లో అత్యంత ప్రమాదకరమైనదిగా పేరుగాంచింది. 2010 నుంచి ఇప్పటివరకు ఈ ఒక్క ఏనుగే 25 మందిని చంపినట్లు చిత్వాన్ నేషనల్ పార్క్ అధికారులు ధ్రువీకరించారు. “ఈ తాజా ఘటనకు ముందు ధ్రుబే 23 మందిని చంపినట్లు మా రికార్డుల్లో ఉంది. ఇప్పుడు జగత్పూర్లో ఇద్దరు మరణించడంతో ఆ సంఖ్య 25కు చేరింది” అని పార్క్ ప్రతినిధి అభినాష్ థాపా మగర్ తెలిపారు. ఈ ఏనుగు పేరు మీద వికీపీడియాలో ఒక పేజీ కూడా ఉండటం దాని భయానక చరిత్రకు నిదర్శనం.
అటవీ అధికారులు ధ్రుబే కదలికలను పర్యవేక్షించడానికి 2016 నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. దానికి ట్రాకింగ్ కాలర్ కూడా అమర్చారు. 2020, 2023లో ఆ కాలర్ను మార్చినప్పటికీ, దానిని పూర్తిగా నియంత్రించడంలో విఫలమయ్యారు. అడవులు తగ్గిపోవడం, మానవ నివాసాలు విస్తరించడం వల్ల నేపాల్లో ఇలాంటి ఘర్షణలు పెరుగుతున్నాయని, ఈ విషాదం దాని తీవ్రతను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిందని నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.