న్యూఢిల్లీ: కేంద్రం అనుసరిస్తున్న విద్యుత్తు విధానాలను ఢిల్లీకి చెందిన ఆమ్ ఆర్మీ పార్టీ తప్పుపట్టింది. విద్యుత్తు వినియోగ ఖర్చును 8 శాతం కేంద్రం పెంచినట్లు ఆ రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆతిషి ఆరోపించారు. దీని వల్ల వినియోగదారులపై భారం పడుతుందని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లోపం వల్లే రాష్ట్రంలో విద్యుత్తు టారిఫ్(Electricity Tariff) పెరుగుతున్నట్లు మంత్రి ఆరోపించారు. అధిక రేట్లకు కోల్ బ్లాక్లను ఇవ్వడం వల్ల కూడా విద్యుత్తు ఛార్జీలు పెరుగుతున్నట్లు ఆమె తెలిపారు. దేశంలో బొగ్గుకు కొరత లేదని, కానీ విద్యుత్తు ధర మాత్రం పెరుగుతోందని ఆమె అన్నారు. అధిక రేట్లకు బొగ్గు కొనేందుకు ఎందుకు విద్యత్తు కంపెనీలను కేంద్రం ఉసికొల్పుతోందని, దీని వల్ల విద్యుత్తును అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. అయితే 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తును ఖర్చు చేసే వారికి ఎటువంటి ప్రభావం ఉండదు. అయితే సబ్సిడీ లేనటువంటి వారికి మాత్రం 8 శాతం అధిక బిల్లు వస్తుంది.