న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds)పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఆ తీర్పును ఇచ్చింది. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్కు చట్టబద్ధత ఉంటుందా లేదా అన్న పిటీషన్లపై కోర్టు తీర్పును వెలువరించింది. బ్లాక్ మనీ సమస్యను పరిష్కరించేందుకు పోల్ బాండ్స్ స్కీమ్ ఒక్కటే పరిష్కారం కాదు అని కోర్టు పేర్కొన్నది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయి, జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలు ఆ ధర్మాసనంలో ఉన్నారు.
ఎన్నికల బాండ్లపై ఏకగ్రీవ తీర్పు ఇవ్వనున్నట్లు సీజేఐ వెల్లడించారు. ధర్మాసనంలోని సభ్యుల మద్య రెండు అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో పాటు తాను కూడా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సీజేఐ తెలిపారు. సరైన ఓటింగ్ ప్రక్రియను తెలుసుకునేందుకు రాజకీయ నిధుల గురించి సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సీజేఐ అన్నారు. ఆర్టికల్ 19(ఏ)(ఏ) ప్రకారం సమాచార హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది.
ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ రాజ్యాంగ వ్యతిరేకమని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. ఆర్పీఏ, ఐటీ చట్టంలో 29(1)సెక్షన్ సవరణ రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందన్నారు. ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసే బ్యాంకులు తక్షణమే బాండ్లను నిలిపివేయాలని కోర్టు తన తీర్పులో తెలిపింది. నిధులు అందుకున్న రాజకీయ పార్టీలు వివరాలను ఎస్బీఐ బ్యాంకు వెల్లడించాలని కోర్టు కోరింది. మార్చి 6వ తేదీలోగా ఎన్నికల సంఘానికి ఆ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి బాండ్కు చెందిన వివరాలను ఎస్బీఐ వెల్లడించాలి.
మార్చి 13వ తేదీ వరకు తమ అధికారిక వెబ్సైట్ ఎన్నికల సంఘం ఆ సమాచారాన్ని పోస్టు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్నికల బాండ్లను రాజకీయ పార్టీలు ఖాతాలో జమా చేయకుంటే, వాటిని రిటర్న్ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.