న్యూఢిల్లీ, జూలై 5: నకిలీ ఓటర్లకు చెక్ పెట్టేందుకు ఓటర్ల లిస్టుతో ఆధార్ అనుసంధానికి అనుమతిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రక్రియ ద్వారా ఆధార్ డాటా దుర్వినియోగమయ్యే అవకాశం ఉందనే ఆందోళన నేపథ్యంలో ఈసీ ఓటరు నమోదు అధికారులకు కీలక హెచ్చరికలు చేసింది.
ఆధార్ డాటా లీకైతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. ఈ మేరకు ఈసీ సోమవారం అన్ని రాష్ర్టాలు, యూటీల ఎన్నికల ప్రధాన అధికారులకు లేఖ రాసింది. ఆధార్ వివరాలు ఇస్తూ ఓటర్లు నింపే దరఖాస్తు ఫారాలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉంచాలని హెచ్చరించింది. ఓటర్ల నమోదు ప్రత్యేక క్యాంపెయిన్ తేదీలకు అనుగుణంగా ఆధార్ లింకింగ్కు క్లస్టర్ స్థాయిలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటే చేయాలని సూచించింది. అయితే ఇదే సమయంలో ఓటర్లు ఆధార్ సమర్పించడం స్వచ్ఛందమని కమిషన్ స్పష్టం చేసింది.