Election Commission | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్లపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకులు సుప్రియా శ్రీనెట్లకు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29న సాయంత్రం 5గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి కంగనాకు బీజేపీ టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనెట్ కంగనా ఫొటోను షేర్ చేస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దాంతో ఆమె పోస్టులు డిలీట్ చేశారు. తన ఇన్స్టా అకౌంట్ యాక్సెస్ చాలా మంది వద్ద ఉందని.. అందులో ఎవరో ఒకరు పెట్టి ఉంటారన్నారు. అలాగే బెంగాల్కు చెందిన సీనియర్ బీజేపీ నేత, ఎంపీ దిలీప్ ఘోష్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కార్యకర్తలు బీజేపీ జాతీయ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన జేపీనడ్డా వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేశారు. ఆ తర్వాత దిలీప్ ఘోష్ క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానన్నారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను టీఎంసీ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు నేతలకు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.