జమ్ము: బీజేపీ పాలనతో జమ్ముకశ్మీర్లో ప్రతిదీ ధ్వంసమైందని పీడీపీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చెప్పారు. జమ్ములో పరిస్థితులు మెరుగుపడిన తర్వాత తాము తిరిగి అక్కడికి వెళ్తామని కశ్మీరీ పండిట్లు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తుంటే.. బీజేపీ ప్రభుత్వం మాత్రం వారి సంపాదనను, రేషన్ను నిలిపివేస్తున్నదని ముఫ్తీ ఆరోపించారు. కశ్మీరీ పండిట్ల సంఘర్షణను బీజేపీ ఓట్ల కోసం వాడుకుంటున్నదని మండిపడ్డారు.
అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కూడా ముఫ్తీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి చెందిన ఒక విభాగంగా మారిపోయిందని ఆరోపించారు. హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలవేళ బీజేపీ మతం పేరుతో ప్రచారం చేస్తుంటే.. కేంద్ర ఎన్నికల సంఘం ఏమీ తెలియనట్లుగా మౌనంగా ఉన్నదని విమర్శించారు.
ఈసీని ఇలాగే వాడుకుంటే దాని స్వయంప్రతిపత్తి ఎంతో కాలం నిలువదని చెప్పారు. బీజేపీ ఇచ్చే సంకేతాలకు అనుగుణంగా కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నదని ముఫ్తీ మండిపడ్డారు.